Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే... వదిలే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి

  • ఫేక్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్నా ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరిక
  • కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు నాలుగు నెలల్లోనే విసిగిపోయారన్న కిషన్ రెడ్డి
  • తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వననే రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నారని ఎద్దేవా
  • తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్న
Kishan Reddy blames Revanth Reddy over amit shah fake video

రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అమిత్ షా ఫేక్ వీడియోను సృష్టించింది కాంగ్రెస్ పార్టీయేనని... దీనికి పూర్తి బాధ్యత సీఎంగా, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిదేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో ఆయనే మొదటి ముద్దాయి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఫేక్ వీడియో సృష్టిలో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఫేక్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, మాఫియా, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీకి ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు.

కేసీఆర్‌ను గద్దెదించడానికి పదేళ్లు పట్టిందని, కానీ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిన్న అకస్మాత్తుగా... ఏమైందో తెలియదు కానీ... ముఖ్యమంత్రి ఏ రకంగా గాడిద గుడ్డు పెట్టించాడో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గాడిదలకు కూడా గుడ్లు పుట్టిస్తున్నాడని చురక అంటించారు. గాడిద గుడ్డును తలపై పెట్టుకొని... నేను మీకు ఇచ్చేది ఇదే... ఇంకా ఏమీ లేదు.. ఈ గాడిద గుడ్డు తప్ప అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు.

నిన్నా మొన్నా రాజ్యాంగం అన్నారని, నిన్న సాయంత్రం గాడిద గుడ్డు నెత్తిపై పెట్టుకొని ఊరేగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. అప్పుడే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుజరాత్ పెత్తనం... తెలంగాణ పౌరుషం.. ఇవేం మాటలు అన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. నాడు టీడీపీలో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మేమే ఉన్నామని... ఇక్కడకు గుజరాత్ రావాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ వారికి తెలంగాణ బీజేపీ పౌరుషం చాలన్నారు. మీ కాంగ్రెస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలన్నారు. ఇక్కడ మమ్మల్ని దాటుకుంటూ పోతేనే గుజరాత్ వెళతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ డీఎన్ఏనే ఇటలీది... విదేశీ పార్టీ అని విమర్శించారు. ఐఎన్‌సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని చురక అంటించారు.

రాహుల్ గాంధీ పని అయిపోయిందన్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయాడని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను పాతర వేయడం ఖాయమన్నారు. ఓటుకు నోటు కేసులో మీరు నాకు మద్దతిచ్చారు... మీ హయాంలో జరిగిన కేసుల్లో నేను మద్దతిస్తాను... మనిద్దరికి మధ్య మజ్లిస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి... కేసీఆర్‌తో డూప్ ఫైట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి వల్ల కాదన్నారు. కేసీఆర్ అవినీతి, కుటుంబపాలన, దుర్మార్గపు చర్యల వల్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు.

తమకు అవకాశం వచ్చినప్పుడల్లా ముస్లిం, దళిత, ఆదివాసీ బిడ్డలను వరుసగా మూడుసార్లు రాష్ట్రపతులుగా చేశామన్నారు. ఓ బీసీ బిడ్డను ప్రధానిగా చేశామన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే యూపీఏ పదేళ్ల కాలంలో తెలంగాణకు ఏమి ఇచ్చారు? ఈ పదేళ్ల మోదీ హయాంలో మేం ఏమిచ్చామో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. మోదీ ప్రభుత్వం ఇస్తామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకోలేదని మొన్నటి వరకు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ నేతలు పలికారన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు రాగానే గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News