లక్ష్మీదేవి అలాంటి నివాసాల్లోనే ఉంటుంది

జీవితం ఎలాంటి కష్టనష్టాలకు లోనుకాకుండా ఆనందంగా .. హాయిగా సాగిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ధనానికి ఎలాంటి లోటు లేకుండా సాఫీగా జరిగిపోవాలని ఆశిస్తారు. ధనం సంపాదించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమవుతుందని చెబుతుంటారు గనుక, ఆ తల్లిని వేడుకుంటూ వుంటారు. సంపదలు పుష్కలంగా ఉండేలా చూడమని పూజలు చేస్తుంటారు. అయితే కేవలం ధనరాశి పెరగాలనే ఉద్దేశంతో ప్రార్ధన చేసినంత మాత్రాన లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహించదు. ఏ ఇంట సోమరులు వున్నా ఆ దరిదాపుల్లోకి కూడా ఆమె రాదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 ధర్మమార్గంలో శ్రమించేవారి పట్లనే ఆ తల్లి ఎక్కువ ప్రీతిని కలిగివుంటుంది. కష్టించేవారి కష్టానికి తగినట్టుగా ఆ ఇంటికి చేరుకోవడానికి ఇష్టపడుతుంది. తాను అనుగ్రహించిన దానిలోనే దానధర్మాలు చేసే వారి పట్ల .. భూతదయ కలిగినవారి పట్ల ఆ తల్లి అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కష్టానికి రెట్టింపు సంపదను ప్రసాదిస్తూ .. ఆ కుటుంబంలో లేమి అనేది లేకుండా చేస్తుంది. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకునేవారు ధర్మబద్ధమైన మార్గంలో శ్రమించాలి .. దయాగుణంతో ఇతరులకు సాయపడాలి ..  మూగ జీవాల పట్ల ప్రేమను కలిగి ఉండాలి .       


More Bhakti News