అష్టాదశ పురాణాలను ఎలా గుర్తుంచుకోవాలి?
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని 'అష్టాదశ పురాణాలు' ఎంతగానో ప్రభావితం చేస్తుంటాయి. ఈ అష్టాదశ పురాణాల్లో ప్రతి పురాణం ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అయితే ఈ పద్ధెనిమిది పురాణాల పేర్లను చెప్పవలసిన పరిస్థితి ఎదురవుతే, ఎవరైనా సరే కాస్త తడబడిపోతుంటారు. అందువలన ఈ పురాణాల పేర్లను గుర్తు పెట్టుకోవడానికిగాను ఒక శ్లోకం చెప్పడం జరిగింది.
''భ ద్వయం మ ధ్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయం
అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షతే ''
భ ద్వయం అనగా 'భ' అనే అక్షరంతో మొదలయ్యే భాగవత .. భవిష్య పురాణాలు,
మ ధ్వయం అంటే 'మ' అనే అక్షరంతో మొదలయ్యే మత్స్య .. మార్కండేయ పురాణాలు, బ్ర త్రయం అనగా బ్రహ్మ .. బ్రహ్మ వైవర్త .. బ్రహ్మాండ పురాణాలు,
వ చతుష్టయం అనగా విష్ణు .. వరాహ .. వామన .. వాయుపురాణాలు
ఇక 'అనాపలింగ కూస్కాని' అంటే ...
'అ' (అగ్ని పురాణం)
'నా' (నారద పురాణం)
'ప' (పద్మపురాణం)
'లిం' (లింగపురాణం)
'గ' (గరుడ పురాణం)
'కూ' (కూర్మపురాణం)
'స్కా' (స్కాందపురాణం) అని చెప్పబడుతోంది.
ఈ శ్లోకాన్ని గుర్తు పెట్టుకుంటేఅష్టాదశ పురాణాలు మన మదిలో పదిలంగా ఉన్నట్టేనని భావించాలి.