కేంద్ర మంత్రి పదవికి జార్జి కురియన్ రాజీనామా
- జూన్ 21న ముగిసిన కురియన్ రాజ్యసభ సభ్యత్వం
- కురియన్ ను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయని బీజేపీ
- కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక క్రిస్టియన్ కురియన్
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగియడం, ఈసారి బీజేపీ అధిష్ఠానం ఆయనను తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జార్జి కురియన్ సమర్పించిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇప్పటివరకు మోదీ క్యాబినెట్లో ఆయన మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు.. మత్స్య, పాడి, పశుపోషణ శాఖలకు కూడా సహాయ మంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహించారు.
జార్జి కురియన్ రాజ్యసభ ఎంపీ పదవీ కాలం గత ఆదివారం అంటే జూన్ 21న ముగిసింది. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. పార్లమెంట్లో (లోక్సభ లేదా రాజ్యసభ) సభ్యుడిగా లేని వ్యక్తి గరిష్ఠంగా 6 నెలలు మాత్రమే మంత్రిగా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈసారి బీజేపీ ఆయనను తిరిగి రాజ్యసభకు పంపేందుకు మొగ్గు చూపకపోవడంతో, ఆయన తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రిస్టియన్ మంత్రి జార్జి కురియన్ మాత్రమే కావడం గమనార్హం. కేరళలో క్రైస్తవ ఓటు బ్యాంక్ను ఆకట్టుకునే క్రమంలో బీజేపీ ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.