కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
- బిడది టౌన్షిప్పై చర్చకు కుమారస్వామికి శివకుమార్ ఆహ్వానం
- బహిరంగ చర్చకు రావాలన్న కుమారస్వామి సవాల్ను స్వీకరించిన డీకే
- వేల ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న స్థానిక రైతులు
ఈ మేరకు సోమవారం కుమారస్వామికి రాసిన లేఖలో, జూన్ 26న ఉదయం 11 గంటలకు విధానసౌధలోని తన కార్యాలయంలో ఐదుగురు సభ్యుల బృందంతో కలిసి సమావేశానికి హాజరు కావాలని శివకుమార్ కోరారు. గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ (జీబీఐటీ) పేరుతో రామనగర జిల్లా బిడది సమీపంలో వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తాము సారవంతమైన వ్యవసాయ భూములను కోల్పోతామంటూ బైరమంగళ ప్రాంత రైతులు గత 450 రోజులకు పైగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రైతులకు మద్దతుగా నిలిచిన కుమారస్వామి ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులతో చర్చించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదని, ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని శివకుమార్ గుర్తుచేశారు. సుమారు 80 శాతం మంది భూ యజమానులు ప్రభుత్వ పరిహారానికి అంగీకరించారని, ఎకరాకు రూ. 2.55 కోట్ల వరకు నగదు లేదా అభివృద్ధి చేసిన భూమిలో వాటా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.