తెలంగాణలో ఆగని వడగాల్పులు.. జూన్ 20 తర్వాతే రుతుపవనాల విస్తరణ
- తెలంగాణలో జూన్ 20 వరకు కొనసాగనున్న పొడి వాతావరణం
- ఉత్తర, తూర్పు జిల్లాలకు మూడు రోజుల పాటు వడగాల్పుల హెచ్చరిక
- సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
- హైదరాబాద్, భద్రాచలం వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
- రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు
బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17, 18, 19 తేదీల్లో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో సూర్యాపేట జిల్లా మోతేలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లా ఏడుపాలెంలో 43.5 డిగ్రీలు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం మీదుగా ప్రయాణిస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే, ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడానికి జూన్ 20-21 వరకు సమయం పట్టవచ్చు. ఈ లోగా పలుచోట్ల సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ తర్వాత 2-3 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.