గ్యాస్ బిల్లును సగం తగ్గించే నిపుణుల స్మార్ట్ చిట్కాలు ఇవే!
- గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై ఇటీవల రూ 29 పెంపు
- ఎల్పీజీ వినియోగాన్ని 50 శాతం తగ్గించుకునేలా నిపుణుల చిట్కాలు
- ప్రెషర్ కుక్కర్ వాడకం, ముందే నానబెట్టడం ద్వారా వంట సమయం,గ్యాస్ ఆదా
గ్యాస్ వినియోగాన్ని సగం తగ్గించే ఆ 10 సూత్రాలు ఇవే
- ప్రెషర్ కుక్కర్ విరివిగా వాడటం: వీలైనంత వరకు వంటకాలకు ప్రెషర్ కుక్కర్ వాడటం వల్ల వంట సమయం 30 నుంచి 70 శాతం వరకు తగ్గుతుంది. ముఖ్యంగా పప్పులు, బీన్స్, మాంసం వండేటప్పుడు ఇది ఇంధనాన్ని బాగా ఆదా చేస్తుంది.
- ముందే నానబెట్టడం: పప్పులు, గింజలు, బియ్యాన్ని వండటానికి కనీసం కొంత సమయం ముందే నానబెట్టాలి. రాజ్మా, శనగలు వంటి వాటిని 8–10 గంటలు, పప్పులను 30–60 నిమిషాలు, బియ్యాన్ని 20-30 నిమిషాలు నానబెడితే అవి 30-50 శాతం వేగంగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది.
- సరైన బర్నర్ ఎంపిక: పాత్ర పరిమాణానికి సరిపోయే బర్నర్నే వాడాలి. చిన్న గిన్నెను పెద్ద బర్నర్పై పెడితే చుట్టూ మంట వృథా అవుతుంది. పెద్ద బర్నర్లను కేవలం భారీ వంటకాలకే పరిమితం చేయాలి.
- పాత్రలపై మూతలు పెట్టడం: వండేటప్పుడు పాత్రలపై మూతలు పెట్టడం వల్ల లోపల ఆవిరి పెరిగి వంట వేగంగా అవుతుంది. ఇది ఇంధన వినియోగాన్ని 20-25 శాతం తగ్గిస్తుంది.
- కూరగాయలను చిన్న ముక్కలుగా కోయడం: కూరగాయలను చిన్న ముక్కలుగా కోయడం వల్ల వేడి త్వరగా లోపలికి వెళ్తుంది. దీనివల్ల పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలు వేగంగా ఉడుకుతాయి.
- మిగిలిన వేడిని ఉపయోగించడం: వంట దాదాపు పూర్తయ్యాక స్టవ్ కట్టేసినా పాత్రలో ఉండే వేడికి ఆహారం ఉడుకుతుంది. అన్నం, కిచిడీ, ఉడికించిన కూరగాయలను 2-3 నిమిషాల ముందే స్టవ్ కట్టేసి ఆ వేడిపైనే మగ్గనివ్వాలి.
- మల్టీ-కుకింగ్: ప్రెషర్ కుక్కర్ లోపల కింద పప్పు, పైన గిన్నెలో బియ్యం, దానిపై చిన్న గిన్నెలో కూరగాయలు పెట్టి ఒకే మంటపై మూడు వంటకాలను ఒకేసారి పూర్తి చేయవచ్చు.
- బర్నర్ల క్లీనింగ్: స్టవ్ బర్నర్ రంధ్రాలలో మురికి చేరితే మంట సరిగ్గా రాదు. బర్నర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల నీలం రంగు మంట వచ్చి వేడి వేగంగా అందుతుంది. పసుపు రంగు మంట వస్తే గ్యాస్ వృథా అవుతున్నట్లు అర్థం.
- మందపాటి, ఫ్లాట్-బాటమ్ పాత్రలు: మందపాటి అడుగు భాగం ఉన్న స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాత్రలు వేడిని సమానంగా పంపిణీ చేస్తాయి. పలుచని పాత్రలు వేడిని వృథా చేయడమే కాకుండా ఆహారాన్ని అడుగున మాడ్చేస్తాయి.
- స్మార్ట్ ప్లానింగ్: వంటకు కావాల్సిన కూరగాయల కోత, మసాలాల తయారీ వంటివన్నీ ముందే సిద్ధం చేసుకున్నాకే స్టవ్ వెలిగించాలి. అలాగే 2-3 పూటలకు సరిపడా అన్నం, పప్పును ఒకేసారి వండుకోవడం వల్ల పదే పదే స్టవ్ వెలిగించే పని తప్పుతుంది.
మూడు నెలల్లో రెండోసారి పెరిగిన ధరలు
దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) గృహ వినియోగ ఎల్పీజీ (14.2 KG) సిలిండర్ ధరను మరో రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన ధరలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. గత మార్చి నెలలో రూ. 60 పెంచిన కంపెనీలు.. కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరలను పెంచడం గమనార్హం. వరుస పెంపులతో సామాన్యుడి వంటగది బడ్జెట్ తలకిందులవుతోంది. అందుకే, ఈ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి నిపుణులు సూచించిన పై చిట్కాలను పాటించడం ప్రతి ఇంటికీ ఎంతో అవసరం.