మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. రిటైరైనా వదిలిపెట్టం: ఐపీఎస్ అధికారులకు హరీశ్ రావు వార్నింగ్
- బీఆర్ఎస్ నేతల ఫోన్లు, ఇంటి ముందు కెమెరాలను హ్యాక్ చేస్తున్నారన్న హరీశ్
- బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించారని ఆరోపణ
- రాబోయేది తమ ప్రభుత్వమేనని వార్నింగ్
బీఆర్ఎస్ అగ్ర నాయకులతో పాటు ఎమ్మెల్యేల ఫోన్లను, వారి ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా కొందరు ఐపీఎస్ అధికారులు హ్యాక్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కొందరు ఐపీఎస్ అధికారులు బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించి తమ వ్యక్తిగత సంభాషణలు, సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారని మండిపడ్డారు.
చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు రిటైర్ అయినా వదిలిపెట్టమని, రాబోయేది తమ ప్రభుత్వమేనని హెచ్చరించారు. బాధ్యులైన వారు సొంత ఖర్చులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్తో పాటు ఇతర నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని ధ్వజమెత్తారు. బెయిల్ వచ్చే సమయంలో పీటీ వారెంట్లు తెచ్చి మరీ జైల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని, ధాన్యానికి ఇవ్వాల్సిన బోనస్ను ఎగ్గొట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.