పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్..? వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ

PIB Factcheck About new rules for exchanging old notes news
  • రద్దయిన 500, 1000 నోట్లపై ప్రచారం.. అదంతా ఫేక్ న్యూస్ 
  • ఆర్బీఐ ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసిన పీఐబీ
  • అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని సూచన
2016లో రద్దయిన పాత ₹500, ₹1000 నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారమవుతోంది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరించింది.

పాత నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్బీఐ ఎలాంటి కొత్త మార్గదర్శకాలను విడుదల చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్-చెక్ టీమ్ తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందేశాలు, స్క్రీన్‌షాట్‌లు పూర్తిగా నకిలీవని పేర్కొంది. కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను (rbi.org.in) మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించింది.

ఇదే సమయంలో, ప్రస్తుతం చలామణిలో ఉన్న కొత్త ₹500 నోట్లను కూడా రద్దు చేయబోతున్నారనే మరో వదంతిని కూడా ప్రభుత్వం ఖండించింది. ఈ నోట్లు యథాతథంగా చెల్లుబాటులో ఉంటాయని, వాటిని రద్దు చేసే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ధ్రువీకరించని, తప్పుడు సమాచారాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది. వాస్తవానికి రద్దయిన పాత నోట్లకు ఇప్పుడు ఎలాంటి ఆర్థిక విలువ లేదు. వాటిని మార్చుకునే అవకాశం కూడా పూర్తిగా ముగిసిపోయింది.
Go Back to Shorts
RBI
Old Notes
Fake news
Old Currency
Exchange

More Telugu News