YCP Leaders: వాలంటీర్ల సాయంతో భూ కబ్జాకు యత్నించారంటూ వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

TDP Receives Grievances on YCP Leaders Land Grabbing
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ (గ్రీవెన్స్) కార్యక్రమం భూ బాధితుల ఆవేదనలతో నిండిపోయింది. గత ప్రభుత్వంలోని వైసీపీ నేతలు, కొందరు అధికారులు, వాలంటీర్ల సాయంతో తమ భూములను కబ్జా చేశారని, రికార్డులను తారుమారు చేసి తమను రోడ్డున పడేశారని పలువురు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. మాజీ మంత్రి, ఏపీ ఉమెన్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

వాలంటీర్లతో కలిసి భూమిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టించారు

అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాసులు తన గోడును వెళ్లబోసుకున్నారు. మార్నెపొలం గ్రామంలో సర్వే నెం. 4-3లో తనకు వారసత్వంగా సంక్రమించిన 7.44 ఎకరాల భూమి ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన కొందరు స్థానిక నేతలు వాలంటీర్లతో కలిసి తన భూమిని అక్రమంగా బ్లాక్ లిస్ట్‌లో పెట్టించారని ఆరోపించారు. తన భూమిని వేరే సర్వే నంబర్‌లోకి మార్చి, తప్పుడు రికార్డులు సృష్టించారని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని, తన భూమిని తనకు ఇప్పించాలని ఆయన నేతలను కోరారు.

పీర్ల చావిడి మాన్యం భూమి కబ్జా

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కానాల గ్రామానికి చెందిన అబ్దుల్ మజీద్, తమ గ్రామంలోని పీర్ల చావిడికి చెందిన 4.40 ఎకరాల మాన్యం భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఫిర్యాదు చేశారు. పూర్వం నుంచి తమ పూర్వీకులు ఈ భూమిని సాగు చేస్తూ వచ్చే ఆదాయంతో పీర్ల చావిడి పండుగ నిర్వహించేవారని, కానీ ఇప్పుడు భూమి కబ్జాకు గురికావడంతో సొంత ఖర్చులతో, భక్తుల చందాలతో పండుగ నిర్వహించడం భారంగా మారిందని వాపోయారు.

9 సెంట్ల స్థలం కోసం దాడి.. కాళ్లు విరగ్గొట్టారు

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం గ్రామానికి చెందిన దాసు రామకృష్ణ, తనపై జరిగిన దాడిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తనకు చెందిన 9 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి రెండు కాళ్లూ విరగ్గొట్టారని, మైనర్ బాలురతో తల పగలగొట్టించారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు నిందితులకే వత్తాసు పలుకుతున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

రికార్డుల తారుమారుతో అంతులేని వేధింపులు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేకమంది బాధితులు భూ రికార్డుల తారుమారు, అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు చేశారు.
అన్నమయ్య జిల్లా: భూమిని అమ్మాక, రీ-సర్వేలోని తప్పులను ఆసరాగా చేసుకుని కొనుగోలుదారు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని శ్రీనివాసులు అనే బాధితుడు తెలిపారు.
నెల్లూరు జిల్లా: తన భూమికి కొలతలు వేసి హద్దులు చూపాలని ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కృష్ణారెడ్డి అనే రైతు వాపోయారు.
ఎన్టీఆర్ జిల్లా: తమ పూర్వీకుల స్థలంలోకి కొందరు వ్యక్తులు చొరబడి ఆక్రమణలకు పాల్పడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
ఏలూరు జిల్లా: పేదలకు కేటాయించిన అసైన్డ్ భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఓ సంపన్న వ్యక్తి పేరు మీద మ్యుటేషన్ చేశారని, సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా ఇవ్వడం లేదని భాస్కరరావు ఆరోపించారు.
కాకినాడ జిల్లా: 1988లో ప్రభుత్వం ఇచ్చిన డి-పట్టా భూమిని ఆన్‌లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిట్టియ్య తెలిపారు.
కృష్ణా జిల్లా: దస్తావేజుల ప్రకారం 1.24 ఎకరాలు ఉండాల్సిన భూమి, ఆన్‌లైన్ రికార్డుల్లో 0.19 సెంట్లుగా నమోదవడంతో రైతు భరోసా వంటి పథకాలు అందడం లేదని చిట్టిబాబు వాపోయారు.
తిరుపతి జిల్లా: ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిని సాగు చేసుకుంటుంటే, ఎటువంటి నోటీసు లేకుండా పట్టా రద్దు చేస్తానని తహసీల్దార్ బెదిరిస్తున్నారని ఎల్లమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా: తన ఖాళీ స్థలానికి వెళ్లే దారిని మూసివేసి, గోడ కట్టి, చంపుతామని బెదిరిస్తున్నారని రామారావు అనే వృద్ధుడు ఫిర్యాదు చేశారు.

వీరితో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సమస్యలకు ఆర్థిక సాయం వంటి పలు సమస్యలపై కూడా ప్రజలు నేతలకు వినతిపత్రాలు సమర్పించారు.
Go Back to Shorts
YCP Leaders
Land grabbing
Andhra Pradesh
Telugu Desam Party
Volunteer
Grievances
Land disputes
Revenue officials
Record tampering
Victims

More Telugu News