Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గే, వేణుగోపాల్‌తో కీలక భేటీ

Revanth Reddy Meets Kharge Venugopal in Delhi Key Discussions
షార్ట్స్‌లో చూడండి
సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధిష్ఠానంతో కీలక సమావేశాలు జరుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. ఖర్గేతో దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షాల తీరు వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవుల నియామకాలపై సీఎం అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా రెండు స్థానాలను గెలుచుకోవడం పట్ల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లను వారు అభినందించారు. అనంతరం నూతన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని వెంటబెట్టుకుని రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్.. ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని గతంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది.

మరోవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇవాళ‌ జరగనున్న ఆదివాసీ కాంగ్రెస్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. తన పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్ చేరుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
AICC
Mallikarjun Kharge
KC Venugopal
Rajya Sabha Elections
Assembly Budget Sessions
Congress Party
Vehm Narender Reddy
Telangana Politics

More Telugu News