Soundararajan: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సౌందరరాజన్ మరణం విచారకరం: సీఎం చంద్రబాబు

Chandrababu Condoles Death of Chilkur Balaji Temple Priest Soundararajan
  • చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు ఎంవీ సౌందరరాజన్ కన్నుమూత
  • ఆయన మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం
  • ఆలయాల సంప్రదాయాలను కాపాడేందుకు సౌందరరాజన్ జీవితాంతం కృషి చేశారని కితాబు
హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయ వంశపారంపర్య ప్రధాన అర్చకుడు ఎం.వి. సౌందరరాజన్ (90) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆలయాల సంప్రదాయాలను, వాటి స్వతంత్రతను కాపాడేందుకు సౌందరరాజన్ జీవితాంతం కృషి చేశారని, ఆయన అందించిన ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియాడారు.

గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న సౌందరరాజన్, హైదరాబాద్ శివారు చిలుకూరులోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆధ్యాత్మికవేత్తగానే కాకుండా, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, రిజిస్ట్రార్‌గా కూడా సేవలు అందించి విద్యావేత్తగా చెరగని ముద్ర వేశారు. ప్రభుత్వ నియంత్రణను వ్యతిరేకిస్తూ ఆలయాల స్వయంప్రతిపత్తి కోసం ఆయన చేసిన పోరాటం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో భాగంగా 1998లో చిలుకూరు ఆలయంలో హుండీని తొలగించి సంచలనం సృష్టించారు.

"సౌందరరాజన్ మరణం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. సౌందరరాజన్ కుమారుడు సీఎస్ రంగరాజన్ ప్రస్తుతం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు.
Soundararajan
Chilkur Balaji Temple
Chandrababu Naidu
Temple Priest Death
Chilkur Balaji
Hyderabad Temples
Temple Autonomy
Andhra Pradesh
CS Rangarajan
Osmania University

More Telugu News