JKSA: కర్నూలు నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు

 JKSA seeks Andhra CMs intervention in alleged harassment of Kashmiri students
  • సీఎం చంద్రబాబు జోక్యం కోరుతూ జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ
  • రంజాన్ ఏర్పాట్లు, హిజాబ్‌పై ఆంక్షలు విధించారని ఆరోపణ
  • 'ఉగ్రవాదులు' అంటూ దూషిస్తున్నారని విద్యార్థినుల ఆవేదన
  • నిష్పక్షపాత విచారణ జరిపి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నాయని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జేకేఎస్ఏ) ఏపీ సీఎం చంద్రబాబు కోరింది. రంజాన్ మాసంలో ప్రత్యేక ఏర్పాట్లు నిరాకరించడం, హిజాబ్ ధరించవద్దని ఒత్తిడి చేయడం, మాటలతో దూషించడం వంటివి చేస్తున్నారని ఆరోపిస్తూ ఇవాళ‌ సీఎంకు లేఖ రాసింది.

జేకేఎస్ఏ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుహెమీ తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దాదాపు 24 మంది కశ్మీరీ విద్యార్థినులు ఈ ఫిర్యాదులు చేశారు. వీరిలో చాలామంది ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ స్కీమ్ (పీఎంఎస్‌ఎస్) కింద చదువుతున్న యువతులే. రంజాన్ మాసంలో సెహ్రీ, ఇఫ్తార్ కోసం ఏర్పాట్లు చేయమని కోరగా, "మతపరమైన ఆచారాలు పాటించాలనుకుంటే కాలేజీలో ఎందుకు చేరారు?" అని యాజమాన్యం ప్రశ్నించిందని విద్యార్థులు ఆరోపించారు.

తమ కశ్మీరీ గుర్తింపు, మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదులు’, ‘ఇడియట్స్’ వంటి పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిజాబ్ తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇది తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని జేకేఎస్ఏ తెలిపింది. ఈ ఘటనల వల్ల విద్యార్థినులు భయం, అవమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇది వారి చదువుపై ప్రభావం చూపుతోందని వివరించింది.

ఈ విషయంపై తక్షణమే స్పందించి, నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని చంద్రబాబును జేకేఎస్ఏ కోరింది. విద్యార్థినుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలని, భయం లేకుండా చదువుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. విద్యాసంస్థలు అందరికీ సురక్షితమైన ప్రదేశాలుగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
JKSA
Chandrababu Kurnool Nursing College
Kashmiri students
Student harassment
Andhra Pradesh
PM Scholarship Scheme
Ramazan
Hijab
Discrimination

More Telugu News