Tirumala Laddu: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి .. విచారణ కమిషన్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Tirumala Laddu Adulterated Ghee Cabinet Approves Investigation
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, అసలు వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు.

కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక, కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి అందిన సమాచారం మధ్య తీవ్రమైన తేడాలు ఉన్నట్టు కేబినెట్ గుర్తించింది. సిట్ విచారణలో వెలుగు చూసిన కొన్ని కీలక అంశాలను ఛార్జ్‌షీట్‌లో ఎందుకు చేర్చలేదనే విషయంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ మూడు అంశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి, అసలు సూత్రధారులను, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిషన్ ద్వారా తిరుమల లడ్డూ పవిత్రతపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విచారణ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కేబినెట్ తెలిపింది.
Go Back to Shorts
Tirumala Laddu
Tirumala
Laddu Prasadam
Adulterated Ghee
Andhra Pradesh Government
Chandrababu Naidu
TTD
Investigation Commission

More Telugu News