Medaram Jatara 2026: మేడారం జాతరకు ఏఐ సొబగులు.. డ్రోన్లు, జియో ట్యాగ్‌లతో హైటెక్ నిఘా

Medaram Jatara 2026 Gets AI Security With Drones and Jio Tags
  • మేడారం జాతరకు తొలిసారిగా ఏఐ సాంకేతికత వినియోగం
  • డ్రోన్లు, హీలియం బెలూన్లతో గగనతలం నుంచి ప్రత్యేక నిఘా
  • తప్పిపోయిన వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ విధానం
  • ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరగాళ్లపై పోలీసుల పర్యవేక్షణ
దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఈసారి ఆధునిక సాంకేతిక హంగులతో జరగనుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ చారిత్రక ఘట్టానికి తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ మునుపెన్నడూ లేనివిధంగా కృత్రిమ మేధ (AI) ఆధారిత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రతా వ్యవస్థ పనితీరును పరిశీలించారు.

జాతర భద్రత కోసం ‘మేడారం 2.0’ పేరుతో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ‘టీజీ-క్వెస్ట్‌’ అనే ఏఐ డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇవి దాదాపు 30 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ మార్గాలపై గగనతలం నుంచి నిరంతరం నిఘా ఉంచుతాయి. వీటితో పాటు ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలను అమర్చారు. ఇవి అత్యంత ఎత్తు నుంచి జనసమూహాన్ని విశ్లేషించి, తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తాయి. ఈ హైటెక్ నిఘా నీడలో సుమారు 13 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక జియో ట్యాగ్‌లు
గత జాతరలో వేలాది మంది తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి వొడాఫోన్-ఐడియా సహకారంతో ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్ల వద్ద వృద్ధులు, పిల్లల వివరాలు నమోదు చేసి, వారికి క్యూఆర్ కోడ్ ఉండే జియోట్యాగ్‌ను చేతికి కడతారు. ఒకవేళ వారు తప్పిపోతే, ఈ ట్యాగ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి వివరాలు సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలోనూ అమలు చేస్తున్నారు.

నేరగాళ్లను గుర్తించేందుకు 'ఫేస్ రికగ్నిషన్' టెక్నాలజీ
జాతరలో నేరగాళ్లను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు. ఆసుపత్రి, పార్కింగ్ స్థలాల వంటి కీలక ప్రదేశాల్లో పాత నేరస్థుల కదలికలను ఈ సాంకేతికత ద్వారా పసిగడతారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించేందుకు రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్ సైతం పనిచేస్తుంది. భక్తుల సౌకర్యం కోసం 2,000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్‌మెంట్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Medaram Jatara 2026
Sammakka Saralamma Jatara
Telangana
Revanth Reddy
AI Drones
Jio Tagging
Facial Recognition
TG Quest
Vodafone Idea

More Telugu News