బెంగళూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Yashaswini Bangalore dental student commits suicide after alleged harassment
బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ డెంటల్ కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల లెక్చరర్ వేధించడం వల్లే తన కుమార్తె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బెంగళూరు శివారులోని అనేకల్ సమీపంలో ఉన్న చందాపురలో శుక్రవారం వెలుగుచూసింది.

మృతురాలిని యశస్విని (23)గా పోలీసులు గుర్తించారు. ఆమె బొమ్మనహళ్లిలోని ఓ ప్రైవేట్ డెంటల్ కాలేజీలో ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతోంది. కంటి నొప్పి కారణంగా జనవరి 7న ఆమె కళాశాలకు హాజరుకాలేదు. మరుసటి రోజు వెళ్లినప్పుడు, ఆమె వాడిన ఐ డ్రాప్స్ గురించి లెక్చరర్ తరగతి గదిలో అందరి ముందు వ్యంగ్యంగా మాట్లాడి అవమానించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. "కంటిలో ఎన్ని చుక్కలు వేసుకున్నావ్? బాటిల్ మొత్తం పోసుకున్నావా?" అంటూ హేళన చేశారని, సెమినార్ ఇవ్వడానికి కూడా అనుమతించలేదని వారు తెలిపారు.

ఈ అవమానం వల్లే యశస్విని తీవ్ర మనస్థాపానికి గురైందని ఆమె తల్లి పరిమళ ఆవేదన వ్యక్తం చేశారు. "నా కూతురు ర్యాంకు విద్యార్థిని. చదువు తప్ప మరో ప్రపంచం తెలియదు. అలాంటిది ఒక్కరోజు సెలవు పెట్టినందుకు అందరి ముందు అవమానిస్తారా? మార్కులు తగ్గిపోతాయని, నేను బాధపడతానని నా కూతురు భయపడింది. నాకు ఉన్నది ఒక్కతే కుమార్తె, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? దీనికి కారణమైన లెక్చరర్‌తో పాటు ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. మరే బిడ్డకూ ఇలాంటి అన్యాయం జరగకూడదు" అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

కాగా, కర్ణాటకలో ఇటీవలి కాలంలో వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో బెలగావి, జూలైలో మాండ్యా, జూన్‌లో శివమొగ్గలోనూ వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు నమోదయ్యాయి. తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Go Back to Shorts
Yashaswini
Yashaswini suicide
Bangalore student suicide
Dental student suicide
Karnataka student suicide
Medical student suicide India
College lecturer harassment
Student mental health
Annekal
Bommanahalli dental college

More Telugu News