Telangana Weather: తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

Telangana Weather Cold wave grips Telangana temperatures drop to single digits
  • రాష్ట్రాన్ని వణికిస్తున్న తీవ్రమైన చలి
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
  • చలి దెబ్బకు రైళ్లలో ఏసీ బోగీలకు తగ్గిన ఆదరణ
  • దేశవ్యాప్తంగా పొగమంచుతో జనజీవనానికి అంతరాయం
తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌ మండలం చలి గుప్పిట్లో చిక్కుకుంది. బుధవారం ఉదయం ఇక్కడ అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదిహేను రోజులుగా ఇక్కడ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటం గమనార్హం.

సాధారణంగా ఏటా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీలు, మెదక్‌ జిల్లా దామరంచలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పలు నగరాల్లో జనజీవనం స్తంభిస్తోంది. అధిక పీడనం, బలహీనమైన వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ కారణంగా పొగమంచు కురుస్తోందని వాతావరణ నిపుణులు తెలిపారు.

చలి తీవ్రత రైల్వే ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఏసీ తరగతులకు ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ, ముంబై వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌లతో పాటు అనకాపల్లి వెళ్లే ప్రత్యేక రైలులో ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను తొలగించి, దాని స్థానంలో ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Telangana Weather
Sangareddy
Kohir
Cold wave
Weather forecast
Fog
Train delays
South Central Railway
Winter
Temperature

More Telugu News