Venkateshwarlu: బాపట్ల జిల్లాలో క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు!

Venkateshwarlu Arrested After Killing Wife in Bapatla District
షార్ట్స్‌లో చూడండి
బాపట్ల జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఓ వ్యక్తి, ఆమె మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో మహాలక్ష్మి భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటోంది.

ఈ క్రమంలో ఆదివారం నాడు వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి మహాలక్ష్మిని కలిశాడు. ఆమెకు సంబంధించిన బంగారం తిరిగి ఇచ్చేస్తానని నమ్మించి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మహాలక్ష్మి మృతదేహాన్ని తన బైక్‌పైనే ఉంచి, సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటనతో షాక్‌కు గురైన పోలీసులు వెంటనే మృతదేహాన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం రొంపిచర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Venkateshwarlu
Bapatla crime
Mahalakshmi murder
Elchuru
Machavaram
Rompicherla
Andhra Pradesh crime
Wife killed
Crime news
Police station surrender

More Telugu News