Rohit Sharma: విజయ్ హజారేలో రోహిత్, కోహ్లీ ఆడటంపై బీసీసీఐ స్పందన

BCCI Denies Pressuring Rohit Sharma Virat Kohli for Vijay Hazare
  • విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
  • ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేసిన బీసీసీఐ
  • ఇది పూర్తిగా వారి సొంత నిర్ణయమని వెల్లడి
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న ఈ దిగ్గజాలు, తమ ఫామ్‌ను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వన్డే కెరీర్‌ను పొడిగించుకోవాలంటే దేశవాళీ టోర్నీ ఆడాలంటూ బీసీసీఐ వారిపై ఒత్తిడి తెచ్చిందన్న ఊహాగానాలను బోర్డు ఖండించింది.

కొన్ని వారాల క్రితం రోహిత్ శర్మ ఈ టోర్నీలో ఆడతానని ప్రకటించగా, తాజాగా విరాట్ కోహ్లీ కూడా తన అంగీకారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వారిని ఆడమని ఆదేశించిందా? అని ప్రశ్నించగా, బోర్డు అధికారి ఒకరు దానిని తోసిపుచ్చారు. "ఆ నిర్ణయం వారు తీసుకున్నారు, అది వారి ఇష్టం" అని ఆయన స్పష్టం చేసినట్లు ‘రెవ్‌స్పోర్ట్స్’ తన కథనంలో పేర్కొంది.

వాస్తవానికి, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్... ఆటగాళ్లకు విరామం దొరికినప్పుడల్లా దేశవాళీ క్రికెట్ ఆడాలని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రోత్సాహం కారణంగానే గతంలో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కూడా రోహిత్, కోహ్లీ రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ, "రోహిత్, కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవం చాలా ముఖ్యం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో వారు ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నా" అని తెలిపారు.
Rohit Sharma
Virat Kohli
Vijay Hazare Trophy
BCCI
Indian Cricket
Domestic Cricket
Ajit Agarkar
Gautam Gambhir
Ranji Trophy
Indian Cricket Team

More Telugu News