శునకానికి హిందూమతంలో ఉన్నత స్థానం ఉంది.. బీజేపీకి ఏం తెలుసు?: రేణుకా చౌదరి
- పార్లమెంటుకు కుక్కపిల్లను తీసుకురావడాన్ని సమర్థించుకున్న రేణుకా చౌదరి
- హిందూమతంలో శునకానికి గౌరవప్రదమైన స్థానం ఉందని వ్యాఖ్య
- బీజేపీది హిందూత్వంపై కేవలం గొప్పలేనని విమర్శ
- తన చర్యపై రేణుకా చౌదరికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
- ఇది పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీయడమేనన్న బీజేపీ
సోమవారం రేణుకా చౌదరి తన కారులో కుక్కపిల్లతో పార్లమెంటుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ, "సంరక్షణ అవసరమైన ప్రతి కుక్కను, ప్రతి జంతువును నేను కాపాడతాను. హిందూమతంలో శునకానికి ఉన్నత స్థానం ఉంది. యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్లినప్పుడు, ఆయనతో పాటు విశ్వాసపాత్రమైన శునకం మాత్రమే వెళ్లింది. వీళ్లకు (బీజేపీ) విశ్వాసం గురించి ఏం తెలుసు?" అని ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎడ్లబండిపై పార్లమెంటుకు వచ్చిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.
ఈ అంశంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పరోక్షంగా రేణుకా చౌదరికి మద్దతు తెలిపారు. మంగళవారం విలేకరులు ఇదే విషయంపై ప్రశ్నించగా, "ఈ రోజుల్లో దేశం ఇలాంటి విషయాలనే చర్చిస్తోంది. పాపం ఆ కుక్కపిల్ల ఏం చేసింది? వాటిని ఇక్కడికి రానివ్వరా?" అని ఆయన అన్నారు. పార్లమెంట్లో పెంపుడు జంతువులకు అనుమతి లేదన్న విషయాన్ని గుర్తు చేయగా, "పెట్స్కు లోపలికి అనుమతి ఉంది" అని పార్లమెంట్ భవనం వైపు చూపిస్తూ వ్యాఖ్యానించారు.
అయితే, రేణుకా చౌదరి తీరును బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఆమె చర్య పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శించింది. సోమవారం మొదలైన ఈ చిన్న వివాదం, కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసి మరింత తీవ్రరూపం దాల్చింది.