యాపిల్ ఏఐకి కొత్త బాస్.. పగ్గాలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి అమర్ సుబ్రమణ్య
- జాన్ జియానాండ్రియా స్థానంలో ఈ కొత్త నియామకం
- ఏఐ రేసులో వెనుకబడిన నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం
- వచ్చే ఏడాదికి వాయిదా పడిన సిరి ఏఐ అప్గ్రేడ్
ఏఐ రంగంలో అమర్ సుబ్రమణ్యకు అపార అనుభవం ఉంది. గతంలో ఆయన మైక్రోసాఫ్ట్లో ఏఐ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అంతకుముందు సుమారు 16 ఏళ్ల పాటు గూగుల్లో సేవలందించారు. అక్కడ జెమిని అసిస్టెంట్ ఇంజనీరింగ్ విభాగానికి ఆయన నేతృత్వం వహించారు. ఇక, జాన్ జియానాండ్రియా వచ్చే ఏడాది తన పదవీ విరమణ వరకు యాపిల్లో సలహాదారుగా కొనసాగుతారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో యాపిల్ ప్రస్తుతం వెనుకబడినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఐఫోన్లకు ఏఐ ఫీచర్లను జోడించడంలో జాప్యం జరుగుతుండటమే దీనికి కారణం. మరోవైపు, యాపిల్ ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్ ఇప్పటికే తన ఫోన్లలో అనేక ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో, యాపిల్ వాయిస్ అసిస్టెంట్ 'సిరి'కి ఏఐ మెరుగులు దిద్దే ప్రక్రియ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే యాపిల్ ఈ కీలక నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.