సత్యసాయి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం: సీఎం చంద్రబాబు
- సత్యసాయి విద్యాసంస్థలు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని కితాబు
- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సూత్రాలను పాటించాలని విద్యార్థులకు దిశానిర్దేశం
- 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఒక ప్రత్యేక ఆశయంతో ఈ భూమిపై అవతరించారు. ఆయన సిద్ధాంతాలు నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక భావనలతో వృద్ధి చెందుతున్న భారతదేశం, 'వసుధైక కుటుంబం' అనే సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సత్యసాయి సిద్ధాంతం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. అందరినీ ప్రేమించడం, ప్రతి ఒక్కరికీ సేవ చేయడం అలవర్చుకోవాలి" అని విద్యార్థులకు సూచించారు.
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు మానవీయ సూత్రాలను ప్రతి విద్యార్థి తమ జీవితంలో భాగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. "మీరు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి, కానీ ఎవరినీ నొప్పించకుండా మెలగాలి. సత్యసాయి విద్యావిధానంలో రాటుదేలిన విద్యార్థులు సమాజానికి, దేశానికి నిర్మాణాత్మక సేవలు అందిస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది" అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, భగవాన్ సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "జీవితంలో ప్రతి రోజూ కీలకమే. సత్యసాయి విద్యాసంస్థలు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పుతూ నైతిక విలువలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. సత్యసాయి సమాజ సేవ కోసం నాయకులను తయారు చేశారు. ఇక్కడి విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ స్నాతకోత్సవంలో వివిధ కోర్సులకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ కూడా విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి. రత్నాకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.