డీకే శివకుమార్ అందుకే జైల్లో ఎమ్మెల్యేలను కలిశారు: కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు

DK Shivakumar met MLAs in jail says Union Minister
  • సెంట్రల్ జైలులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసిన డీకే శివకుమార్
  • ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే ఎమ్మెల్యేల మద్దతు అవసరమన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
  • అందుకే ఆయన ఎమ్మెల్యేలను కూడగడుతున్నారని వ్యాఖ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ తమ బలాలను నిరుపించుకునేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అందులో భాగంగానే డీకే నిన్న బెంగళూరు సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినయ్ కులకర్ణి, వీరేంద్ర పప్పీని కలిశారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి ఇన్ని రోజులు వారిని కలవని డీకే శివకుమార్, ఇప్పుడు జైలుకు వెళ్లి మరీ కలవడం విమర్శలకు తావిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని డీకే అడిగినప్పుడల్లా ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అధిష్ఠానం అడుగుతున్నట్లుగా ఉందని, అందుకే ఆయన ఎమ్మెల్యేలను కూడగట్టుకుంటున్నారని అన్నారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీకే వర్గానికి చెందిన ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. డీకేకు సొంత బలం, సామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. తనకు ఉన్న మద్దతును ఢిల్లీలో ప్రదర్శించడం లేదా గొడవలు సృష్టించడం వంటి అవసరం ఆయనకు లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Go Back to Shorts
DK Shivakumar
Siddaramaiah
Karnataka politics
Prahlad Joshi
Congress MLAs

More Telugu News