దుబాయ్ ఎయిర్ షోలో 'తేజస్' క్రాష్... మరణించిన పైలట్ ఇతడే!
- దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్ యుద్ధ విమానం
- ప్రమాదంలో ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ నమన్ శ్యాల్ మృతి
- పైలట్ మృతిపై హిమాచల్ సీఎం, ఐఏఎఫ్ తీవ్ర దిగ్భ్రాంతి
- ఘటనపై విచారణకు ఆదేశించిన భారత వాయుసేన
- తేజస్ విమానానికి ఇది రెండో ప్రమాదం
ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో వైమానిక విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై భారత వాయుసేన స్పందిస్తూ, పైలట్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పైలట్ నమన్ శ్యాల్ అకాల మరణంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కాంగ్రా జిల్లాకు చెందిన వీరపుత్రుడు నమన్ శ్యాల్ మరణవార్త తీవ్రంగా కలచివేసింది. దేశం ఒక ధైర్యవంతుడైన, సమర్థుడైన పైలట్ను కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
తేజస్ విమానాలను తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. కాగా, తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. గతంలో 2024లో జైసల్మేర్ సమీపంలో తొలి ప్రమాదం జరిగింది.