కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
- కాంగోలో గనుల శాఖ మంత్రి విమానానికి ప్రమాదం
- రన్వేపై నుంచి జారిపోయి మంటల్లో చిక్కుకున్న విమానం
- మంత్రి సహా 20 మంది ప్రయాణికులు సురక్షితం
- గని ప్రమాద స్థలికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళ్తే.. లువాలాబా ప్రావిన్స్లోని కలాండో రాగి గనిలో శనివారం వంతెన కూలిన ఘటనలో 32 మంది మరణించారు. ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు గనుల శాఖ మంత్రి లూయి వాటమ్ కబాంబ, తన బృందంతో కలిసి రాజధాని కిన్షాసా నుంచి బయల్దేరారు.
మంత్రి, ఇతర అధికారులతో కలిపి మొత్తం 20 మంది ప్రయాణిస్తున్న విమానం కోల్వేజీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి రన్వే నుంచి పక్కకు జారిపోయింది. వెంటనే ప్రయాణికులందరూ కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికే విమానానికి మంటలు అంటుకున్నాయి.
కాగా, కాంగోలో లక్షలాది మందికి ఈ రాగి గనులే జీవనాధారం. అయితే, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.