బుల్ రన్: ఆరో రోజూ లాభపడ్డ సూచీలు.. 26,000 దాటిన నిఫ్టీ
- వరుసగా ఆరో సెషన్లోనూ లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు
- 388 పాయింట్లు పెరిగి 84,950 వద్ద ముగిసిన సెన్సెక్స్
- 26,013 వద్ద ముగిసిన నిఫ్టీ
- మిడ్క్యాప్ కంపెనీల త్రైమాసికం ఫలితాలతో బలపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
సోమవారం ఉదయం సెన్సెక్స్ 84,700.50 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ సెషన్ మొత్తం సానుకూలంగానే సాగింది. ఇంట్రాడేలో 84,988.09 వద్ద గరిష్ఠ స్థాయిని, 84,581.08 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది.
విశ్లేషకుల ప్రకారం, మిడ్క్యాప్ కంపెనీలు రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి మంచి ఫలితాలను ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. ఇది మార్కెట్ వృద్ధికి దోహదపడింది. భవిష్యత్తులో కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదిరితే మార్కెట్ మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
సెన్సెక్స్-30 షేర్లలో మారుతీ సుజుకి, కొటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టైటన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, ఎల్&టీ, ఎన్టీపీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది.