Sheikh Hasina: నేను తిరిగి వస్తా.. బంగ్లా గడ్డపై న్యాయం చేస్తా: షేక్ హసీనా

Sheikh Hasina dismisses court verdict concerns vows justice
  • కోర్టు తీర్పును తాను లెక్కచేయనన్న షేక్ హసీనా
  • యూనస్ ప్రభుత్వం తన పార్టీని నాశనం చేయాలని చూస్తోందని ఆరోపణ
  • తనపై వచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు అవాస్తవం
  • తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి న్యాయం చేస్తానని భరోసా  
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా తనపై రానున్న కోర్టు తీర్పును తాను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేశారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆమె తన మద్దతుదారుల కోసం ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.

ప్రస్తుతం ఢిల్లీలో తలదాచుకుంటున్న హసీనా, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూనస్ ప్రభుత్వం తన పార్టీ అయిన అవామీ లీగ్‌ను పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. "అవామీ లీగ్ ప్రజల నుంచి పుట్టింది తప్ప, అధికార దురాక్రమణదారుల జేబుల్లోంచి రాలేదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

గతేడాది తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు మోపింది. విచారణకు హాజరు కావాలని ఢాకా కోర్టు ఆదేశించినా ఆమె పట్టించుకోలేదు.

తన మద్దతుదారులు ఆందోళన చెందవద్దని కోరిన హసీనా, "నేను బతికే ఉన్నా. మళ్లీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాను. బంగ్లాదేశ్ గడ్డపైనే న్యాయం చేస్తాను" అని అన్నారు. పది లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కోర్టు తీర్పులు తనను ఆపలేవని, సమయం వచ్చినప్పుడు అన్నింటికీ లెక్కలు చెల్లిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Sheikh Hasina
Bangladesh
Awami League
Mohammad Yunus
Human Rights Violation
International Crimes Tribunal
Rohingya Refugees
Dhaka Court
Bangladesh Politics
Political Conspiracy

More Telugu News