Nara Lokesh: కార్యకర్తే అధినేత... అధికారంలో ఉన్నాం అని నిర్లక్ష్యం వద్దు: నారా లోకేశ్

Nara Lokesh Says Party Workers are Leaders
  • టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేశ్ కీలక సమావేశం
  • ఈ నెలాఖరులోగా పార్టీ, నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని ప్రకటన
  • ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలు తీర్చాలని స్పష్టీకరణ
  • వైసీపీ హయాంలోని అక్రమ కేసులను సమీక్షించి న్యాయం చేస్తామని హామీ
  • ఇంఛార్జ్ మంత్రులు, మిత్రపక్షాలతో సమన్వయంగా పనిచేయాలని సూచన
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నిజమైన అధినేతలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

"టీడీపీ సిద్ధాంతం ప్రకారం పార్టీలో కార్యకర్తే అధినేత. ఈ విధానం పక్కాగా అమలవ్వాలి. ప్రతీ కార్యకర్తకు తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కేలా చూడాలి. అధికారంలోకి వచ్చామన్న భావనతో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కసితో, పట్టుదలతో పనిచేశామో, ఇప్పుడు అంతకుమించిన ఉత్సాహంతో పనిచేసి కార్యకర్తలకు అండగా నిలవాలి" అని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజలకు, కార్యకర్తలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

నెలాఖరులోగా పదవుల భర్తీ

ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా 'గ్రీవెన్స్' కార్యక్రమాలు నిర్వహించాలని లోకేశ్ ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తమ స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులన్నింటినీ సమీక్షించి, వారికి చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

సమన్వయంతో ముందుకు సాగాలి

రాష్ట్రంలోని అన్ని జోన్ల కోఆర్డినేటర్లు తమ పరిధిలోని ఇంఛార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని లోకేశ్ సూచించారు. ముఖ్యంగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్‌లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. జోనల్ కోఆర్డినేటర్లు ప్రతి నియోజకవర్గంలో పర్యటించి, పార్టీ వ్యవహారాలపై సమీక్షలు జరపాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య సత్సంబంధాలు పెంచే బాధ్యత కోఆర్డినేటర్లదేనని స్పష్టం చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కార్యకర్తలు, కుటుంబ సాధికార సారథులతో సమావేశాలు నిర్వహించి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలన్నారు.

ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు పింఛన్ల పంపిణీ, గ్రీవెన్స్, క్యాడర్ మీటింగ్స్, స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని జోనల్ కోఆర్డినేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమాలపై వారు సమర్పించే నివేదికలను పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని తెలిపారు. పార్టీ ప్రమాద బీమాకు సంబంధించిన చెక్కులను కూడా సకాలంలో బాధిత కుటుంబాలకు అందజేయాలని ఆదేశించారు. ప్రతీ నాయకుడు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే నడవాలని, సమష్టి కృషితో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Palla Srinivasa Rao
Party Workers
Grievance Program
YCP Cases
Janasena
BJP

More Telugu News