మంగళగిరిలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్
- 72వ రోజుకు చేరిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం
- రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు
- ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్న మంత్రి లోకేశ్
- కొన్ని సమస్యలపై అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ
- అర్జీలన్నింటినీ త్వరగా పరిష్కరిస్తామని బాధితులకు హామీ
కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ మంత్రి లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను వివరిస్తూ ప్రజలు, కార్యకర్తలు అందించిన వినతిపత్రాలను ఆయన స్వీకరించారు. కొన్ని కీలకమైన సమస్యలపై లోకేశ్ అక్కడికక్కడే స్పందించి, వాటి పరిష్కారం కోసం తన సిబ్బందికి, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించి, వారికి అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందిన ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి, న్యాయమైన పరిష్కారం అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. మంత్రి నుంచి హామీ లభించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.