Indian Women's Cricket Team: దశ తిరిగింది... భారత మహిళా క్రికెటర్లతో ఒప్పందాలకు క్యూ కడుతున్న కంపెనీలు!

Indian Womens Cricket Team Brands Queue Up for Endorsement Deals
  • 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగిన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు
  • సెమీస్‌ హీరో జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 100 శాతం వృద్ధి
  • జెమీమా ఒక్కో బ్రాండ్‌కు రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్లు డిమాండ్
  • స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు కూడా విపరీతంగా పెరిగిన డిమాండ్
  • టీమిండియా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్రాండ్ల సోషల్ మీడియా పోస్టులు
ప్రపంచకప్ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా క్రీడాకారిణుల బ్రాండ్ విలువ ఆకాశమే హద్దుగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ విజయం, పాత గాయాలను మాన్పి, వారికి సరికొత్త అవకాశాల ద్వారాలు తెరిచింది. ఈ గెలుపు తర్వాత భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు ఇప్పటికే 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగినట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలీ వర్మ వంటి క్రీడాకారిణుల సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్లు వెల్లువెత్తారు. కొందరి ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు నుంచి మూడు రెట్లు పెరిగింది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాల కోసం విచారణలు అపూర్వమైన రీతిలో పెరిగాయి. "విజయం సాధించిన ఉదయం నుంచే బ్రాండ్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కేవలం కొత్త ఒప్పందాలకే కాకుండా, పాత ఒప్పందాలను పునరుద్ధరించుకోవడానికి కూడా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఫీజులను 25-30 శాతం పెంచాలని కోరుతున్నాయి" అని బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా తెలిపారు.

ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 127 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 100% పెరిగింది. "ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన వెంటనే మాకు వినతుల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం 10-12 కేటగిరీలకు చెందిన బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నాం" అని జెమీమా వ్యవహారాలు చూస్తున్న జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ వివరించారు. నివేదిక ప్రకారం, జెమీమా ప్రస్తుతం ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది.

దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్మృతి మంధాన ఇప్పటికే హెచ్‌యూఎల్, రెక్సోనా, నైక్, హ్యుందాయ్, ఎస్‌బీఐ, గల్ఫ్ ఆయిల్ సహా 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది. ఆమె ఒక్కో బ్రాండ్‌కు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్లు ఆర్జిస్తోంది. మరోవైపు, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ఫైనల్ ఫలితం రాకముందే సర్ఫ్ ఎక్సెల్ 'దాగ్ అచ్ఛే హై' ప్రచారంలో భాగంగా పూర్తి పేజీ ప్రకటనను సిద్ధం చేసింది.

ఈ విజయం తర్వాత స్విగ్గీ, ప్యూమా, పెప్సీ వంటి అనేక పెద్ద బ్రాండ్లు సోషల్ మీడియాలో భారత జట్టుకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టాయి. ఈ గెలుపు భారత మహిళా క్రికెటర్లకు ఎంతోకాలంగా రావాల్సిన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే, ప్రస్తుతం లభిస్తున్న ఈ ఆదరణను భవిష్యత్తులోనూ నిలబెట్టుకోవడం వారి ముందున్న అసలైన సవాల్.
Indian Women's Cricket Team
Jemimah Rodrigues
Smriti Mandhana
Harmanpreet Kaur
Deepti Sharma
Shafali Verma
Women's T20 World Cup
Brand Endorsement
Cricket Sponsorship
Indian Cricket

More Telugu News