కాసేపట్లో కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన
- మొంథా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జగన్
- పెడన నియోజకవర్గం గూడూరులో రైతులతో నేరుగా భేటీ
- రైతుల సాధకబాధకాలను అడిగి తెలుసుకోనున్న జగన్
ఈ ఉదయం 9.30 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి కృష్ణా జిల్లా పర్యటనకు బయల్దేరుతారు. పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా ప్రయాణించి పెడన నియోజకవర్గంలోని గూడూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులతో నేరుగా మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెబుతారు.
మొంథా తుపాను కారణంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టారు. రైతులను కలిసి వారి సాధకబాధకాలు విననున్నారు. గూడూరులో పర్యటన ముగించుకుని, మధ్యాహ్నం అవనిగడ్డ హైవే మీదుగా తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.