చెరువులో దిగి చేపల వల లాగిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో!

Rahul Gandhi Participates in Fishing With Bihar Fishermen
  • బీహార్‌లోని బెగుసరాయ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ
  • మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యల గురించి ఆరా
  • స్వయంగా నీటిలోకి దిగి మత్స్యకారులతో కలిసి వల లాగిన వైనం
  • మత్స్యకారుల కఠోర శ్రమ, అభిరుచి స్ఫూర్తిదాయకమన్న రాహుల్
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యకారులు కీలక భాగమని వెల్లడి
  • వారి హక్కుల కోసం ప్రతి అడుగులోనూ అండగా ఉంటానని హామీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓ కొత్త పాత్రలో కనిపించారు. బెగుసరాయ్‌లో మత్స్యకారులతో సమావేశమైన ఆయన, కేవలం వారి సమస్యలు వినడానికే పరిమితం కాలేదు. స్వయంగా నీటిలోకి దిగి, వారితో కలిసి చేపల వల లాగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతో పూర్తిగా మమేకమై వారి జీవన విధానం, ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు.

వీఐపీ పార్టీ అధ్యక్షుడు ముఖేశ్ సహానీతో కలిసి రాహుల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తన అనుభవాలను పంచుకుంటూ, "ఈ రోజు బెగుసరాయ్‌లోని మత్స్యకార సోదరులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. వారి పని ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, దానితో ముడిపడి ఉన్న సమస్యలు, పోరాటాలు కూడా అంతే తీవ్రమైనవి" అని పేర్కొన్నారు.

"ప్రతికూల పరిస్థితుల్లోనూ వారి కఠోర శ్రమ, అభిరుచి, వ్యాపారంపై వారికి ఉన్న లోతైన అవగాహన ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది" అని రాహుల్ గాంధీ వివరించారు. బీహార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నదులు, కాలువలు, చెరువులు, వాటిపై ఆధారపడిన మత్స్యకారులు ఒక ముఖ్యమైన భాగమని ఆయన అభిప్రాయపడ్డారు. వారి హక్కులు, గౌరవం కోసం తాను ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Rahul Gandhi
Bihar Elections
Begusarai
Fishermen
Mukesh Sahani
VIP Party
Fishing
Indian National Congress
Bihar Economy

More Telugu News