జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు
- పార్టీ గుర్తుతో ఓటర్ స్లిప్పులు పంచుతున్నారని ఆరోపణ
- రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి
- ఆర్వో ఆదేశాలతో కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో ఉన్న ఓటర్ స్లిప్పులను ప్రజలకు పంచుతున్నారని కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇది ఎన్నికల నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నేరుగా రిటర్నింగ్ అధికారికి (ఆర్వో) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును స్వీకరించిన రిటర్నింగ్ అధికారి, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆర్వో ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బోరబండ పోలీసులు, మాగంటి సునీతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.