నాన్నలాగే కష్టపడి పేరు తెచ్చుకుంటా: విక్రమ్ తనయుడు ధ్రువ్
- తెలుగు ప్రేక్షకుల ముందుకు తమిళ హిట్ 'బైసన్'
- ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్
- మూడేళ్లు కబడ్డీ నేర్చుకున్నానన్న హీరో ధ్రువ్ విక్రమ్
- షూటింగ్లో చేయి విరగడంతో పాటు మూడు పళ్లు దెబ్బతిన్నాయని వెల్లడి
- ధ్రువ్ డెడికేషన్కు ఆశ్చర్యపోయానన్న అనుపమ పరమేశ్వరన్
- అర్జున అవార్డు గ్రహీత జీవిత కథ ఆధారంగా చిత్రం
"ఈ సినిమా కోసం హైదరాబాద్ ప్రమోషన్కు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా నంబర్ల గురించి కాకుండా ప్రేక్షకుల ప్రేమ సంపాదించడమే నాకు ముఖ్యం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్న విక్రమ్ స్టార్ అయ్యారు. నేను కూడా ఆయనలాగే కష్టపడి తెలుగు వారి అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను" అని ధ్రువ్ అన్నారు. తనకు తెలుగులో డైలాగ్స్ రాసిచ్చింది 'హాయ్ నాన్న' డైరెక్టర్, తన స్నేహితుడు శౌర్య అని ఆయన తెలిపారు.
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పనిచేయాలన్న తన కల ఈ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. "మారి సెల్వరాజ్ మొదటి సినిమా చూసినప్పటి నుంచే ఆయనతో పనిచేయాలని ఉండేది. ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ధ్రువ్ డెడికేషన్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. తమిళంలో వచ్చిన అద్భుతమైన స్పందన తెలుగులో కూడా వస్తుందని నమ్ముతున్నాను" అని ఆమె అన్నారు.
అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ పతాకాలపై పా. రంజిత్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అర్జున అవార్డు గ్రహీత, కబడ్డీ క్రీడాకారుడు మణతి గణేశన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. క్రీడా స్ఫూర్తితో పాటు సామాజిక అంశాలను స్పృశిస్తూ రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ బ్యానర్పై తెలుగులో విడుదల కానుంది.