Yusuf Pathan: యూసుఫ్ పఠాన్ పోస్ట్‌తో దుమారం.. అది మసీదు కాదు, ఆలయం అంటున్న బీజేపీ

Yusuf Pathan Post Sparks Controversy Adina Masjid or Temple BJP Claims
  • బెంగాల్‌లోని అదినా మసీదుపై టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ సోషల్ మీడియా పోస్ట్
  • మసీదును ఆదినాథ్ ఆలయమంటూ స్పందించిన బీజేపీ బెంగాల్ శాఖ
  • ఆలయంపైనే మసీదు నిర్మించారని నెటిజన్ల వాదన
  • గతేడాది మసీదులో హిందూ పూజలు చేసిన పూజారుల బృందం
  • పురావస్తు శాఖ పరిధిలో ఉన్న జాతీయ ప్రాముఖ్యత గల కట్టడం
భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదుపై ఆయన చేసిన పోస్ట్‌తో పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కట్టడం మసీదు కాదని, అది ఆదినాథ్ ఆలయం అని బీజేపీ వాదిస్తోంది.

అసలేం జరిగింది?
గురువారం యూసుఫ్ పఠాన్, మాల్దాలోని అదినా మసీదును సందర్శించిన ఫొటోలను 'ఎక్స్' (ట్విట్టర్) లో పంచుకున్నారు. "పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ఉన్న అదినా మసీదు ఒక చారిత్రక కట్టడం. దీనిని 14వ శతాబ్దంలో ఇలియాస్ షాహీ వంశానికి చెందిన రెండో పాలకుడు సుల్తాన్ సికందర్ షా నిర్మించారు. 1373-1375 మధ్య కాలంలో నిర్మించిన ఈ మసీదు, అప్పట్లో భారత ఉపఖండంలోనే అతిపెద్దదిగా ఉండేది" అని పఠాన్ తన పోస్టులో పేర్కొన్నారు.

పఠాన్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే బీజేపీ బెంగాల్ శాఖ దీనిపై తీవ్రంగా స్పందించింది. అది అదినా మసీదు కాదని, ఆదినాథ్ ఆలయమని కౌంటర్ ఇచ్చింది. ఇదే సమయంలో పలువురు సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అనేక చారిత్రక ఆధారాలను ఉటంకిస్తూ, ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి దానిపై ఈ కట్టడాన్ని నిర్మించారని యూసుఫ్ పఠాన్‌కు సూచించారు.

గతేడాది కూడా వివాదం
అదినా మసీదు వివాదాలకు కేంద్రంగా నిలవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది, వృందావన్‌కు చెందిన విశ్వవిద్యా ట్రస్ట్ అధ్యక్షుడు హిరణ్మోయ్ గోస్వామి నేతృత్వంలోని పూజారుల బృందం ఈ కట్టడంలోకి ప్రవేశించి హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించింది. కట్టడం లోపల హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, ఇది ఒకప్పుడు ఆలయమేనని వారు వాదించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాత, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) గోస్వామిపై కేసు నమోదు చేసింది.

ఈ వివాదం నేపథ్యంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ కట్టడాన్ని అధికారులు మూసివేశారు. భద్రతను కట్టుదిట్టం చేసి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక పోలీస్ చెక్‌పోస్ట్‌ను కూడా నెలకొల్పారు.

ఏఎస్ఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, అదినా మసీదును 1369లో బెంగాల్ సుల్తానేట్‌కు చెందిన సికందర్ షా నిర్మించారు. ఇది ఆ కాలపు ముస్లిం వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఏఎస్ఐ పేర్కొంది. సికందర్ షా సమాధి కూడా ఇందులోనే ఉంది. తాజా పరిణామాలతో ఈ చారిత్రక కట్టడం మరోసారి వార్తల్లో నిలిచింది.
Yusuf Pathan
Adina Masjid
West Bengal
BJP
Adinath Temple
Malda
Sikandar Shah
ASI
Archaeological Survey of India
Controversy

More Telugu News