UIDAI: సామాన్యులకు షాక్: ఆధార్ అప్‌డేట్ ఛార్జీలను పెంచిన యూఐడీఏఐ

UIDAI Hikes Aadhar Update Charges for Citizens
  • ఐదేళ్ల తర్వాత తొలిసారిగా సవరించిన రుసుములు
  • డెమోగ్రాఫిక్ మార్పులకు రూ. 75, బయోమెట్రిక్‌కు రూ. 125
  • పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్లకు పూర్తి మినహాయింపు
  • ఇంటి వద్దకే ఆధార్ సేవలకు ప్రత్యేక చార్జీల విధానం
ఆధార్ కార్డు వినియోగదారులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఆధార్ కార్డు వివరాలలో మార్పులు చేసుకోవడానికి చెల్లించాల్సిన రుసుములను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పెంచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఛార్జీలను సవరించడం గమనార్హం. ఈ కొత్త రుసుముల విధానం 2028, సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత వీటిపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

తాజా పెంపు ప్రకారం పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి డెమోగ్రాఫిక్ వివరాల మార్పు కోసం ఇకపై రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ చార్జీ రూ. 50గా ఉండేది. అదేవిధంగా, వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ కోసం రుసుమును రూ. 100 నుంచి రూ. 125కి పెంచారు. ఆధార్ కార్డు జారీ అయిన తర్వాత చేసే మార్పులకు మాత్రమే ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.

అయితే, కొన్ని కీలక సేవలకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. కొత్తగా పుట్టిన శిశువులకు ఆధార్ నమోదు ప్రక్రియను యథావిధిగా ఉచితంగానే అందిస్తారు. అలాగే, పిల్లలకు ఐదేళ్ల వయసులోనూ, ఆ తర్వాత 5 నుంచి 7 ఏళ్ల మధ్య, తిరిగి 15 నుంచి 17 ఏళ్ల మధ్య తప్పనిసరిగా చేయించాల్సిన బయోమెట్రిక్ అప్‌డేట్లకు కూడా ఎలాంటి రుసుము వసూలు చేయరని యూఐడీఏఐ తెలిపింది.

ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లలేని వారి సౌలభ్యం కోసం యూఐడీఏఐ ఇంటి వద్దకే సేవలను (డోర్‌స్టెప్ సర్వీసెస్) కూడా అందిస్తోంది. ఈ సేవలను పొందాలంటే, జీఎస్‌టీతో కలిపి రూ. 700 ఛార్జీగా చెల్లించాలి. ఒకవేళ ఒకే కుటుంబంలో ఎక్కువ మంది ఈ సేవలను వినియోగించుకుంటే, మొదటి వ్యక్తికి రూ. 700, ఆ తర్వాత ప్రతి అదనపు వ్యక్తికి రూ. 350 చొప్పున వసూలు చేస్తారని అధికారులు వివరించారు.
UIDAI
Aadhar update charges
Aadhar card
biometric update
demographic details
Aadhar charges increase
India
Aadhar registration
doorstep service

More Telugu News