నేడు వైసీపీ కీలక నేతలతో జగన్ భేటీ... ఈ అంశాలే ప్రధాన అజెండా!
- వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ
- తాడేపల్లిలో ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశం
- ఈనెల 9న మెడికల్ కాలేజీలపై వైసీపీ పోరుబాట
- ఆందోళనపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్
- నకిలీ మద్యం అంశంపైనా చర్చించే అవకాశం
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పోరును ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలను ఏ విధంగా సమీకరించాలనే దానిపై జగన్ నేతలతో చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో మెడికల్ కళాశాలల అంశంతో పాటు, రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాల ఆరోపణలపైనా చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పార్టీ సమావేశాల్లో 'జగన్ 2.0', డిజిటల్ బుక్ వంటి కార్యక్రమాలు ప్రకటించిన జగన్, ఈసారి పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.