దుర్గా నిమజ్జనంలో హింస.. రణరంగంగా మారిన కటక్ నగరం
- ఒడిశాలోని కటక్లో దుర్గా నిమజ్జనంలో హింస
- డీజే సౌండ్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- రాళ్లు, సీసాలతో దాడులు.. 25 మందికి గాయాలు
- నగరంలో 36 గంటల పాటు కర్ఫ్యూ విధింపు
- ఇంటర్నెట్, సోషల్ మీడియా సేవలపై నిషేధం
దుర్గా నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు, సీసాలతో దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది పోలీసుల సహా మొత్తం 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. “ఇలాంటి నేరాలకు పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం” అని ఓ అధికారి వెల్లడించారు. ఈ హింసను ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాంఝీ తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పరిపాలనా లోపం వల్లే ఈ హింస జరిగిందని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం కటక్లో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.