తోపుదుర్తికి పరిటాల సునీత స్ట్రాంగ్ వార్నింగ్
- పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- హౌసింగ్ లబ్ధిదారుల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారని విమర్శ
- ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు నియోజకవర్గంలో హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నిరుపేదలను కూడా వదలకుండా పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు.
తోపుదుర్తి ఆరోపణలపై పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. "కారు కూతలు కూస్తే కఠిన చర్యలు తప్పవు. కడుపుకు అన్నం తినేవాడెవడూ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడు," అని మండిపడ్డారు. తమ కుటుంబం పది రూపాయలు జేబులోంచి తీసి పేదలకు సాయం చేస్తుందే తప్ప, ఇతరుల వద్ద చేయి చాపే అలవాటు తమ రక్తంలోనే లేదని ఆమె స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే ఇలాంటి పనులు చేసి ఉండొచ్చని, అందుకే ఆయనకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయని పరిటాల సునీత ఎదురుదాడి చేశారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.