AP High Court: 13 ఏళ్ల మిస్సింగ్ కేసు.. సామాన్యుల కేసులంటే ఇంత నిర్లక్ష్యమా?: పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

AP High Court Angered Over Police Negligence in 13 Year Missing Case
షార్ట్స్‌లో చూడండి
పదమూడేళ్ల కిందట నమోదైన ఓ మహిళ అదృశ్యం కేసులో దర్యాప్తు పూర్తి చేయకపోవడంపై పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సామాన్య ప్రజలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రశ్నించింది. కేసు పురోగతిపై తాజా వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే, పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన బండారు ప్రకాశరావు తన కుమార్తె మంగాదేవిని మోహన్‌బ్రహ్మాజికి ఇచ్చి వివాహం చేశారు. అయితే 2012 అక్టోబరు 18న మంగాదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆమె భర్త, ప్రకాశరావుకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ప్రకాశరావు, అదే రోజు తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

అయితే, కేసు నమోదు చేసి ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తన కుమార్తె ఆచూకీ కోసం ప్రకాశరావు సీఐడీ, కలెక్టర్, ఎస్పీ, మానవ హక్కుల కమిషన్ వంటి పలు అధికార యంత్రాంగాలకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన న్యాయం కోసం 2017లో హైకోర్టును ఆశ్రయించారు.

ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, కేసు ఫైళ్లను పరిశీలించి పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తులో ఇంత జాప్యం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ దాఖలు చేసే అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
Go Back to Shorts
AP High Court
Missing case
West Godavari
Police negligence
CBI investigation
Bandaru Prakash Rao
Manga Devi
Tadepalligudem police
Andhra Pradesh High Court
Case investigation

More Telugu News