Shyamala: విగ్గు, పెగ్గు కాదు... సిగ్గుండాలి!: బాలకృష్ణపై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు

Anchor Shyamala Criticizes Balakrishnas Remarks on YS Jagan
  • టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆగ్రహం
  • వైఎస్ జగన్‌ను "సైకో" అనడాన్ని తీవ్రంగా ఖండించిన శ్యామల
  • గతంలో వైఎస్సార్ చేసిన సహాయాన్ని బాలయ్య మరిచిపోయారంటూ విమర్శ
  • ఇంట్లో కాల్పుల ఘటనలో వైఎస్సార్ ఆదుకున్నారంటూ స్పష్టీకరణ 
  • బసవతారకం ఆసుపత్రి బకాయిలు చెల్లించింది జగన్ ప్రభుత్వమేనని వెల్లడి
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి "సైకో గాడు" అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు.

గతంలో బాలకృష్ణకు వైఎస్ కుటుంబం అండగా నిలిచిందని శ్యామల వెల్లడించారు. "మీ ఇంట్లో కాల్పుల ఘటన జరిగినప్పుడు, మిమ్మల్ని ఆ కేసు నుంచి కాపాడింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ విషయాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోయారు?" అని ఆమె ప్రశ్నించారు. ఆపద సమయంలో ఆదుకున్న వారిని విమర్శించడం తగదని ఆమె అన్నారు.

అంతేకాకుండా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సహాయం చేశారని తెలిపారు. "గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలను జగన్ గారి ప్రభుత్వమే విడుదల చేసింది. ఆ విషయం మీకు గుర్తులేదా?" అని ఆమె నిలదీశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణపై శ్యామల కొన్ని ఘాటైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. "నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలి" అంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శ్యామల పేర్కొన్నారు.
Shyamala
Balakrishna
YS Jagan
TDP
YSRCP
Andhra Pradesh Politics
Basavatarakam Cancer Hospital
Political Criticism
Anchor Shyamala
YS Rajasekhara Reddy

More Telugu News