Kerala SRTC: ఒక్క టికెట్ రద్దుకు రూ. 82 వేలు చెల్లించిన కేఎస్ ఆర్టీసీ.. అరెస్ట్ భయంతో దిగొచ్చిన ఎండీ!

Kerala SRTC Pays Rs 82000 for Ticket Cancellation
  • ముందస్తు సమాచారం లేకుండా బస్సు రద్దు చేసిన కేరళ ఆర్టీసీ
  • నష్టపోయిన టీచర్‌కు రూ. 82,000 పరిహారం చెల్లించాలని ఆదేశం
  • ఉత్తర్వులు పట్టించుకోని ఆర్టీసీ.. ఎండీపై అరెస్ట్ వారెంట్ జారీ
  • అరెస్ట్ భయంతో వెంటనే పరిహారం చెల్లించిన ఎండీ
ప్రయాణికురాలి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ ఆర్టీసీ)కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా బస్సును రద్దు చేసి, ఓ టీచర్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు గాను ఏకంగా రూ. 82,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. మొదట ఈ ఆదేశాలను తేలిగ్గా తీసుకున్న ఆర్టీసీ.. మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)పై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో తలొగ్గక తప్పలేదు. అరెస్టును నివారించుకునేందుకు ఎండీ స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించారు.

 అదూర్‌లోని చూరకోడ్‌లో గల ఎన్‌ఎస్‌ఎస్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ప్రియ అనే టీచర్ పనిచేస్తున్నారు. ఆమె తన పీహెచ్‌డీ గైడ్‌ను కలిసేందుకు 2018 ఆగస్టు 2న మైసూర్ వెళ్లాల్సి ఉంది. దీనికోసం జూలై 29న ఆన్‌లైన్‌లో రూ. 1,003 చెల్లించి కొట్టారక్కర డిపో నుంచి రాత్రి 8:30 గంటలకు బయలుదేరే కేరళ ఆర్టీసీ స్కానియా బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారు.

ప్రయాణం రోజున కొట్టారక్కర బస్ స్టేషన్‌కు చేరుకున్న ప్రియ బస్సు కోసం ఎదురుచూశారు. సమయం గడుస్తున్నా బస్సు రాకపోవడంతో అధికారులను సంప్రదించగా కాసేపట్లో వస్తుందని రెండుసార్లు ఫోన్‌లో హామీ ఇచ్చారు. అయితే, రాత్రి 9 గంటల సమయంలో తిరువనంతపురం డిపోకు ఫోన్ చేయగా బస్సు ట్రిప్పును రద్దు చేశారనే చేదువార్త తెలిసింది.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రియ ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు చేతులెత్తేశారు. చేసేది లేక, ఆమె కాయంకుళం వరకు టాక్సీలో ప్రయాణించి, అక్కడ రాత్రి 11:55 గంటలకు మైసూర్ వెళ్లే మరో బస్సు ఎక్కారు. అనుకున్న సమయానికి మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 11 గంటలకు మైసూర్ యూనివర్సిటీకి చేరుకోవడంతో, ఆమె తన గైడ్‌తో జరగాల్సిన ముఖ్యమైన సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల మరో మూడు రోజులు అక్కడే అదనంగా ఉండాల్సి వచ్చింది.

ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియ తాను చెల్లించిన టికెట్ డబ్బులు వాపసు ఇవ్వాలని కేరళ ఆర్టీసీని కోరగా, వారు నిరాకరించారు. దీంతో ఆమె వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్ కేరళ ఆర్టీసీ వైఫల్యం స్పష్టంగా ఉందని తేల్చింది. టికెట్ డబ్బులు రూ. 1,003తో పాటు, ప్రియకు కలిగిన మానసిక క్షోభ, ఇతర నష్టాలకు గాను రూ. 82,555 పరిహారంగా చెల్లించాలని కేరళ ఆర్టీసీ ఎండీని ఆదేశించింది.

అయితే, కేరళ ఆర్టీసీ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కమిషన్ ఎండీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు అరెస్టును నివారించుకునేందుకు వెంటనే బాధితురాలికి పరిహారం మొత్తాన్ని చెల్లించారు. కమిషన్ ప్రెసిడెంట్ బేబీచన్ వేచుచిర, సభ్యుడు నిషాద్ తంకప్పన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
Kerala SRTC
Priya
KSRTC
consumer forum
bus ticket cancellation
compensation
arrest warrant
Kerala State Road Transport Corporation
consumer court
transport

More Telugu News