మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం... గురువారం నాటికి మరొకటి!
- ఏపీపై మరో వాన గండం
- రేపటిలోగా బంగాళాఖాతంలో అల్పపీడనం!
- గురువారం నాటికి తూర్పుమధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
- వాయుగుండంగా మారే అవకాశం
వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో పాటు, గురువారం నాటికి తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది శుక్రవారం నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం శనివారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. అధికార యంత్రాంగం కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.