Rohit Sharma: బెంగళూరులో చెమటోడ్చుతున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్... వీడియో ఇదిగో!

Rohit Sharma and KL Rahul Sweating it Out in Bangalore
  • రాబోయే క్రికెట్ సీజన్ కోసం సిద్ధమవుతున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్
  • బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక శిక్షణ
  • స్కిల్స్, స్ట్రెంగ్త ట్రైనింగ్‌పై దృష్టి సారించిన సీనియర్ ఆటగాళ్లు
భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లైన కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రాబోయే బిజీ క్రికెట్ సీజన్ కోసం తమ సన్నాహాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ ఇద్దరు ఆటగాళ్లు కఠోరంగా సాధన చేస్తూ చెమటోడుస్తున్నారు. త్వరలో జరగనున్న కీలక సిరీస్‌లే లక్ష్యంగా వీరిద్దరూ తమ నైపుణ్యాలకు పదును పెడుతున్నారు.

రాబోయే సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని రోహిత్, రాహుల్ ఇక్కడ ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని బీసీసీఐ అధికారికంగా తెలిపింది. తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆదివారం ఓ వీడియోను పంచుకుంటూ, వీరిద్దరూ స్కిల్స్, స్ట్రెంత్ ట్రైనింగ్‌పై దృష్టి సారించారని వెల్లడించింది. విభిన్న పరిస్థితులను అనుకరించేలా (సిమ్యులేట్) వీరి ప్రాక్టీస్ సెషన్లు సాగినట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా, కేఎల్ రాహుల్ త్వరలోనే పోటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ 23 నుంచి లక్నో వేదికగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరగనున్న రెండో మల్టీ-డే మ్యాచ్‌లో రాహుల్ ఇండియా ఏ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత రాహుల్ ఆడనున్న తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఆ సిరీస్‌లో రాహుల్ 53 సగటుతో 532 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లు అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లో, 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో జరుగుతాయి. మరోవైపు, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అక్టోబర్ 19న పెర్త్‌లో తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
Rohit Sharma
KL Rahul
BCCI
India A
Cricket
Training
Australia A
West Indies
Yashasvi Jaiswal
Cricket Series

More Telugu News