Harish Rao: బతుకమ్మ, దసరాకు బస్సు ఛార్జీల పెంపు.. తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Harish Rao slams bus fare hike for Batukamma Dasara
  • పండగ వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై హరీశ్ రావు తీవ్ర విమర్శ
  • ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనపు వసూళ్లు సరికాదన్న హరీశ్
  • ప్రయాణికులపై పెను భారం మోపడం దుర్మార్గమని వ్యాఖ్య
  • పాత బస్సులకే స్పెషల్ బోర్డులు తగిలించి దోపిడీ చేస్తున్నారని ఆరోపణ
  • ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అని సూటి ప్రశ్న
తెలంగాణలో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

పండుగలు వస్తే ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రత్యేక సర్వీసుల పేరుతో పల్లె వెలుగుతో సహా అన్ని బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడం ప్రయాణికులపై పెనుభారం మోపడమేనని ఆయన అన్నారు. ఈ చర్యతో ప్రజల పండుగ సంతోషాన్ని ప్రభుత్వం దూరం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రజాపీడనే అని పేర్కొన్నారు.

అదనంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయకుండా రోజూ తిరిగే బస్సులకే 'పండుగ స్పెషల్' అని బోర్డులు తగిలించి ప్రజలను దోచుకోవడం దారుణమని హరీశ్ రావు ఆరోపించారు. పండుగ వేళ ప్రజలకు సంతోషం లేకుండా చేయడమేనా ప్రజా పాలన అంటే అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అని నిలదీశారు. తక్షణమే ఈ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Harish Rao
Telangana RTC
Bus charges hike
Batukamma
Dasara
Congress Government
Festival special buses

More Telugu News