ఐసీసీతో పెట్టుకున్న పీసీబీ.. చిక్కుల్లో పాక్ క్రికెట్ బోర్డు
- మ్యాచ్ రిఫరీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కారణం
- నిబంధనల ఉల్లంఘనపై పీసీబీకి ఐసీసీ సీఈఓ ఈ-మెయిల్
- రిఫరీ క్షమాపణ చెప్పలేదని, కేవలం విచారం వ్యక్తం చేశారని ఐసీసీ స్పష్టీకరణ
- యూఏఈతో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాక్ జట్టు బెదిరింపు
- భారత్తో మ్యాచ్ తర్వాత మొదలైన అసలు వివాదం
వివరాల్లోకి వెళితే... బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్కు ముందు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పాకిస్థాన్ జట్టుతో మాట్లాడారు. ఈ సంభాషణను పీసీబీ అనుమతి లేకుండా చిత్రీకరించి, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది ఐసీసీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ‘ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పీఎంఓఏ)’లో అనధికారిక చిత్రీకరణను ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఇప్పటికే పీసీబీకి ఒక ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం.
అంతేకాకుండా, మ్యాచ్ రిఫరీ తమకు క్షమాపణలు చెప్పారని పీసీబీ చేసిన ప్రకటనను కూడా ఐసీసీ ఖండించింది. పైక్రాఫ్ట్ కేవలం "అపార్థంపై విచారం వ్యక్తం చేశారని" మాత్రమే ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ రిఫరీ గదిలోకి మీడియా మేనేజర్ నయీమ్ గిలానీని తీసుకురావొద్దని చెప్పినా పీసీబీ పట్టించుకోలేదు. ఒకవేళ అతడిని అనుమతించకపోతే మ్యాచ్ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
భారత్తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత ఈ వివాదం మొదలైంది. మ్యాచ్కు ముందు, తర్వాత భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయలేదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆరోపిస్తూ మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను టోర్నీ నుంచి తొలగించాలని పీసీబీ పలుమార్లు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే, పీసీబీ అభ్యర్థనలను ఐసీసీ తోసిపుచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన పాక్ బోర్డు, యూఏఈతో మ్యాచ్కు ముందు నానా హంగామా సృష్టించింది. జట్టు హోటల్ నుంచి ఆలస్యంగా బయలుదేరడంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఐసీసీపై ఒత్తిడి తెచ్చేందుకు పీసీబీ చేసిన ప్రయత్నాలే ఆ బోర్డు మెడకు చుట్టుకున్నాయి.