తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ స్పందన
- పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం వల్లే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశామన్న మహేశ్ గౌడ్
- ఎవరు పార్టీలు పెట్టినా స్వాగతిస్తామని వ్యాఖ్య
- తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఏం సంబంధమని ప్రశ్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంశంపై కూడా మహేశ్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించినందువల్లే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అయినప్పటికీ, బీసీల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా మల్లన్నను తాను గౌరవిస్తానని అన్నారు. రాజకీయాల్లో ఎవరు పార్టీలు పెట్టినా స్వాగతిస్తామని, మల్లన్న కొత్త పార్టీ నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా ఆయన స్పందించారు. కోమటిరెడ్డి సోదరులు తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తారని, కాంగ్రెస్ పార్టీలో ఆ మేరకు స్వేచ్ఛ ఉందని తెలిపారు. అయితే, ఆ స్వేచ్ఛను అలుసుగా తీసుకుని ఎవరైనా 'రెడ్ లైన్' దాటితే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించే చర్యలను సహించబోమని తేల్చిచెప్పారు.