AI Video: ప్రధాని మోదీ తల్లి ఏఐ వీడియో.. కాంగ్రెస్‌పై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Patna High Court orders Congress to remove AI video on PM Modis mother from social media
  • ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై దుమారం
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బిహార్ కాంగ్రెస్
  • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు
  • వీడియోను తక్షణమే తొలగించాలని కాంగ్రెస్‌కు ఆదేశం
  • రాజకీయాల్లో ఇది ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లి హీరాబెన్‌కు సంబంధించిన ఏఐ-జనరేటెడ్ వీడియో వివాదంలో బిహార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వీడియోపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు, రాజకీయాల్లో ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ వీడియోను తక్షణమే తొలగించాలని బుధవారం కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది.

బీహార్ కాంగ్రెస్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఇటీవల ఒక వివాదాస్పద వీడియోను పంచుకుంది. అందులో ప్రధాని మోదీ కలలోకి ఆయన తల్లి వచ్చినట్లు, ఆయనతో మాట్లాడుతున్నట్లు ఏఐ సాంకేతికతతో సృష్టించారు. ఈ వీడియో బయటకు రావడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఇది ప్రధానిని, ఆయన తల్లిని అవమానించడమేనని, రాజకీయ గౌరవానికి ఇది విరుద్ధమని బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన పాట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.బి. బజంత్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజకీయ చర్చల్లో ఇలాంటి వీడియోలు తగవని వ్యాఖ్యానిస్తూ, ఇంటర్నెట్ నుంచి పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కోర్టు నుంచి ఈ ఆదేశాలు రావడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. హైకోర్టు తీర్పును బీజేపీ నేతలు స్వాగతించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని వారు వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

గతంలో దర్భంగాలో జరిగిన ‘మహాఘట్‌బంధన్’ యాత్రలోనూ ఇలాంటి వివాదమే చెలరేగింది. ఆ సభ వేదికపై నుంచి ఒక వ్యక్తి ప్రధాని మోదీని, ఆయన తల్లిని కించపరిచేలా తీవ్రమైన పదజాలంతో దూషించిన వీడియో వైరల్ అయింది. ఆ సమయంలోనూ బీజేపీ, ఎన్డీయే పక్షాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతిపక్ష నేతలు రాజకీయ హుందాతనాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారని ఆరోపించాయి. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.
AI Video
PM Modi
Narendra Modi
Heeraben Modi
Patna High Court
Bihar Congress
Defamation
Political controversy
Social media
BJP
NDA

More Telugu News