హైదరాబాద్ మెట్రోలో ట్రాన్స్జెండర్లకు కొలువులు
- 20 మంది ట్రాన్స్జెండర్లు సెక్యూరిటీ గార్డులుగా నియామకం
- నియామక పత్రాలు అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
- ట్రాఫిక్ విభాగం తర్వాత మెట్రో భద్రతలోనూ అవకాశం
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు అండగా నిలవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వారు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వివరించారు.
ట్రాన్స్జెండర్లకు ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో ఉపాధి కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ వంటి కీలకమైన సంస్థలో భద్రతా సిబ్బందిగా నియమించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ట్రాన్స్జెండర్లు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.