ఆ హీరోయిన్ అక్కడ ఉండగానే గుమ్మడిగారు ఆ మాట అన్నారు: సీనియర్ డైరెక్టర్!
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న 'లక్ష్మణ రేఖ'
- హీరోయిన్ గా జయసుధ తొలి పరిచయం
- ఆమె ఆ పాత్రకి సెట్ కాదన్న గుమ్మడి
- ఆయనను ఒప్పించానన్న దర్శకుడు
"మరాఠీ సినిమాను నేను చూశాను. ఆ సినిమాలో జడ్జి పాత్రకి గుమ్మడి అయితే బాగుంటారనీ, మిగతా ఆర్టిస్టులు మీ ఇష్టం అని నిర్మాతలు అన్నారు. నాకు కాస్త పరిచయమున్న హీరోయిన్స్ ను అడిగితే, ఏడాది వరకూ వాళ్ల డేట్స్ ఖాళీగా లేవు. అలాంటి పరిస్థితుల్లోనే నేను 'నోము' సినిమా చూశాను. అందులో చిన్న పాత్రను చేసిన జయసుధ గారిని నా సినిమాలో హీరోయిన్ గా పెడితే బాగుంటుందని భావించాను. అలాగే అన్నీ సెట్ చేశాను" అని అన్నారు.
"ఈ సినిమా ప్రారంభం రోజున గుమ్మడిగారికి జయసుధను పరిచయం చేశాను. ఆమెనే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర చేస్తుందని తెలిసి గుమ్మడిగారు ఆశ్చర్యపోయారు. "ఈ అమ్మాయి హీరోయినా .. ఏ పిక్చర్ లో చేసిందండీ .. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటున్నారు .. ఇంతవరకూ ఈ అమ్మాయి హీరోయిన్ గా చేయలేదని చెబుతున్నారు .. కాన్వెంట్ అమ్మాయి .. తెలుగు సరిగ్గా రాదు .. ఎలా ఈ అమ్మాయిని ఎంపిక చేశారు? అని అడిగారు. ఆ సమయంలో జయసుధ .. ఆమె పేరెంట్స్ అక్కడే ఉన్నారు. ఈ అమ్మాయి పనికిరాదు అనే విషయాన్ని ఆయన వాళ్ల దగ్గరే చెప్పారు. దాంతో వాళ్లు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఆ తరువాత నేను చెప్పిన విషయాలను విని ఆయన ఓకే అన్నారు" అని చెప్పారు.